బండ్లగూడ, అక్టోబర్ 21: ఐదున్నర లక్షలు లంచం తీసుకుం టూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… లంగర్హౌజ్కు చెంది న అర్వింద్ మహేశ్కుమార్ చిన్నమ్మకు గంధంగూడలో 350 గజాల స్థలం ఉన్నది. దాన్ని అభివృద్ధి చేసేందుకు ఓ బిల్డర్కు బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్దిరోజుల క్రితం బిల్డర్ దాన్ని విరమించుకోవడంతో అర్వింద్ సదరు డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకునేందుకు రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ మీర్ అర్షద్ అలీని సంప్రదించారు. అగ్రిమెంట్ రద్దు కోసం సబ్రిజిస్ట్రార్ రూ.5.50 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆయన ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. గురువారం రాజేంద్రనగర్ కార్యాలయంలో అర్వింద్ మహేశ్కుమార్ నుంచి సబ్ రిజిస్ట్రార్ మీర్ అర్షద్ అలీ రూ.5 లక్షలు, డాక్యుమెంట్ రైటర్ వాసు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా మీర్ అర్షద్ అలీ గతంలోనూ అవినీతి కార్యకలాపాల ఆరోపణలపై సస్పెండ్ అయినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితులను శుక్రవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.