హైదరాబాద్ : పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్డ్ పార్టీ స్టడీ చేయించాల్సిందేనని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ డిమాండ్ చేశారు. ముంపు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన సాగునీటి పారుదల శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో రజత్ కుమార్ ఈ డిమాండ్ చేశారు.
ముంపు సమస్యలపై రజత్ కుమార్ బలంగా వాదనలు వినిపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక మార్పులు జరిగాయని, ఆ మేరకు ముంపు సమస్య కూడా తీవ్రం కానుందని నొక్కిచెప్పారు. అంచనాకు మించి ముంపు వాటిల్లనుందని గణాంకాలతో సహా వివరించారు. చారిత్రక ప్రదేశాలు, పవర్ ప్లాంట్ ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఇక సమావేశంలో పాల్గొన్న ఒడిశా, ఛత్తీస్గఢ్ సైతం అదే వాదనలను వినిపించాయి. తమ రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేప్పట్టలేదని అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాల్సిందేనని పట్టబట్టాయి. అదే విధంగా ముంపు నివారణకు రక్షణ చర్యలు సత్వరమే చేపట్టాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల వాదనలు విన్న తరువాత మరోసారి వచ్చేనెల 7న సమావేశన్ని నిర్వహించాలని జల్ శక్తిశాఖ నిర్ణయించింది.