న్యూఢిల్లీ : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన కరోనా డ్రగ్ 2-డీయోక్సీ-డీ-గ్లూకోస్ (2డీజీ) అన్ని రకాల కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ఓ కొత్త అధ్యయనంలో తేలింది. డ్రగ్ సార్స్-కోవ్-2 వైరస్ మల్టిఫికేషన్ను తగ్గిస్తుందని కొత్త అధ్యయనం పేర్కొంది. 2డీజీ డ్రగ్ కణాల్లో సంక్రామ్యత ప్రేరిత సైటోపతిక్ ప్రభావాన్ని (సీపీఈ) తగ్గించడంతో పాటు తొలగింపును నిరోధిస్తుందని ప్రాథమిక అధ్యయనాలు నిరూపించాయి. 2డీజీ ఔషధం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మే 17న డీఆర్డీఓ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ డ్రగ్ కొవిడ్ రోగులకు ఇస్తే రికవరీ రెండున్న రోజులు, 40 శాతం ఆక్సిజన్ డిమాండ్ను తగ్గిస్తుందని డీఆర్డీఓ తెలిపింది. మోసర్తు నుంచి తీవ్రమైన కరోనా రోగులకు అనుబంధంగా చికిత్స కోసం అత్యవసర వినియోగం కిందట డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 15న ప్రచురితమైన ఈ కొత్త అధ్యయనాన్ని ఇంకా సమీక్షించలేదు. అనంత్ నారాయణ్ భట్, అభిషేక్ కుమార్, యోగేష్ రాయ్, ధివియా వేదగిరి తదితరులు ఈ అధ్యయన నివేదికను తయారు చేశారు. 2డీజీ డ్రగ్ను వ్యాధితో బాధపడుతున్న రోగుల్లో కొవిడ్-19 సంక్రమణ ద్వారా ప్రేరేపించిన జీవక్రియ పునరుత్పత్తిని లక్ష్యంగా చేసుకునేందుకు, నిరోధించేందుకు ఉపయోగించబడుతుంది. కొవిడ్-19 సంక్రామ్యత శరీరంలోకి గ్లూకోజ్ అధిక ప్రవాహాన్ని, కణాల్లో గ్లైకోలైసిస్కు కారణమవుతుందని, ఫలితంగా ఫ్లోరోసెంట్ గ్లూకోజ్, 2-ఎన్బీడీజీ అధికంగా పేరుకుపోతాయని ఫలితాల్లో చూపాయి.
హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ సహకారంతో డీఆర్డీఓ డ్రగ్ను అభివృద్ధి చేయగా.. రెడ్డీస్ లాబోరేటరీస్ ఉత్పత్తి చేయనుంది. సాచెట్ ధరను రూ.900గా నిర్ధయించింది. అయితే కేంద్రానికి, రాష్ట్రాలకు సబ్సిడీపై అందజేయనున్నట్లు పేర్కొంది. అయితే, డ్రగ్ వాడకం విషయంలో డీఆర్డీఓ పలు సూచనలు చేసింది. వైద్యుల సిఫారసు మేరకే వాడాలని సూచించింది. మధుమేహం, తీవ్రమైన గుండె, మూత్రపిండ సమస్యలు, ఏఆర్డీఎస్ మొదలైన వ్యాధులతో బాధపడుతున్న రోగులపై డ్రగ్ ప్రభావం ఇంకా అధ్యయనం చేయలేదు. తీవ్రమైన, మితమైన చికిత్సలో వినియోగించేందుకు డీఆర్డీఓ సిఫారసు చేసింది.