న్యూఢిల్లీ : కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారు ఒమిక్రాన్ బారిన పడితే వారిలో బూస్టర్ డోస్ తీసుకోవడంతో పోలిస్తే రోగనిరోధక వ్యవస్ధ మెరుగ్గా ఉంటోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో టీకా తీసుకున్న వారిలో బూస్టర్ డోస్ కంటే ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్స్తో మెరుగైన ఇమ్యూనిటీ కనిపిస్తోందని తేలింది.
వ్యాక్సినేషన్ పూర్తయిన వారు ఒమిక్రాన్ వేరియంట్ బారినపడితే పలు రకాల కొవిడ్ వేరియంట్లను దీటుగా ఎదుర్కొనేలా వారిలో యాంటీ బాడీలు చురుకుగా ఉన్నట్టు పలు అధ్యయనాలు వెల్లడించాయి. వ్యాక్సిన్ తయారీ కంపెనీ బయోఎన్టెక్, ఎస్ఈ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఈ వివరాలు వెలుగుచూశాయి. బయోఆర్ఎక్సివ్ సర్వర్ ప్రీప్రింట్లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
అయితే అధ్యయనంలో వెల్లడైన వివరాల ఆధారంగా ఇన్ఫెక్షన్ల బారిన పడాలని కోరుకోరాదని అధ్యయన రచయితలు హెచ్చరించారు. టీకా తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్లు సోకితే అవి మరో టీకా డోసుతో సమానమని, ఇటీవల ఎవరైనా కొవిడ్ ఇన్ఫెక్షన్కు గురైతే మరో బూస్టర్ డోసు కోసం కొద్ది కాలం వేచిచూడాలని ఈ అధ్యయనాన్ని సమీక్షించిన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా డైరెక్టర్, ప్రొఫెసర్ జాన్ వెర్రీ పేర్కొన్నారు.