Studies in China | వేలాదిమంది భారతీయ విద్యార్థులకు చైనా తీపి కబురందించింది. చైనాలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు కరోనా ఉధృతం కావడంతో 2020లో స్వదేశానికి తిరిగి వచ్చారు. కరోనాను పూర్తిగా కట్టడి చేయడానికి చైనా కూడా నాటి నుంచి ఇప్పటివరకు విదేశీ విద్యార్థులను అనుమతించలేదు. ఈ విషయమై శనివారం భారత్లో చైనా రాయబారి సన్వైడంగ్ స్పందించారు. చైనాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు త్వరలో భారతీయ విద్యార్థులను అనుమతిస్తున్నట్లు తెలిపారు.
తొలి బ్యాచ్ భారత విద్యార్థులు త్వరలో చైనాకు బయలుదేరి వెళతారని సన్వైడంగ్ అన్నారు. భారతీయ విద్యార్థుల ఉన్నత విద్యాకోర్సులు పూర్తి చేసేందుకు రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయన్నారు. రెండేండ్ల క్రితం కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తుండటంతో భారత్, చైనా వీసాల జారీపై ఆంక్షలు విధించాయి. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు సస్పెండ్ చేశారు.
తాజాగా పరిమితంగా రెండు దేశాల మధ్య విమాన సర్వీసుల నిర్వహణకు చర్చలు జరుగుతున్నాయని చైనా అధికారులు తెలిపారు. చైనా ఉన్నత విద్యా కోర్సుల్లో చేరిన విద్యార్థుల రాక పక్రియ మొదలైందని గతవారం ప్రారంభంలో చైనా తెలిపింది. చైనాలోని ఉన్నత విద్యా సంస్థల్లో 23 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ కోర్సుల్లో అభ్యసిస్తున్నారు. వారంతా తిరిగి చైనాలోని తమ విద్యా సంస్థల్లో చేరే ప్రక్రియ ప్రారంభమైందని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పారు. వీరిలో అత్యధికులు వైద్య విద్యాకోర్సులు అభ్యసిస్తున్నారు.