అనంతపురం : విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడం పట్ల అనంతపురం జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో తెలుగు విద్యార్థి సంఘంతోపాటు ఎస్ఎఫ్ఐ, పాల్గొన్నాయి.
ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం తగదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూరి అన్నారు. విశ్వవిద్యాలయంలో సమస్యలను పరిష్కరించకుండా తప్పుదోవపట్టించేలా పేరు మార్చారని ఆరోపించారు. ప్రజాసమస్యలను పరిష్కరించకుండా పేరు మార్పును రాజకీయంగా వాడుకోవాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని ఆరోపించారు. పేరు మార్చే బిల్లును తీసుకురావడం వల్ల తాను అనుకున్నది నెరవేర్చుకున్నట్లుగా కనిపిస్తున్నదని విమర్శించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అనేక ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడని తెలుగు యువత నగర అధ్యక్షుడు శివ చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పేరు మార్పు కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో తమ ఆందోళనను ఉదృతం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.