లక్నో: చిన్న రోడ్డు ప్రమాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థిపై దాడి చేసిన కొందరు, కత్తి వంటి పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సోమవారం ఈ ఘటన జరిగింది. కుషావలి ప్రాంతానికి చెందిన గోపాల్ అనే విద్యార్థి పాండుశిల రోడ్డులో కోచింగ్ తీసుకుంటున్నాడు. కోచింగ్ క్లాస్ తర్వాత సర్ధానా ప్రాంతంలోని అశోక్ కి లాత్ పోలీస్ పోస్ట్ సమీపంలోని ఒక రెస్టారెంట్లో పిజ్జా తినేందుకు వెళ్లాడు. అనంతరం గోపాల్ బయటకు రాగా పది మంది వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ఐస్ను కట్ చేసే ఇనుప కత్తి వంటి ఆయుధంతో అతడ్ని పొడిచారు. బాధితుడు సహాయం కోసం కేకలు వేసినప్పటికీ అతడ్ని రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సమీపంలోని పోలీస్ పోస్ట్లో ఉన్న పోలీసులు కూడా స్పందించలేదు.
బాధితుడు గోపాల్ కిందపడిన తర్వాత కొందరు అక్కడకు వచ్చారు. ఒక నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడ్ని పోలీసులు తర్వాత అరెస్ట్ చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన గోపాల్కు తొలుత ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఢిల్లీలోకి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయాడు.
కాగా, చిన్న రోడ్డు ప్రమాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణ విద్యార్థి గోపాల్ హత్యకు దారి తీసిందని మీరట్ ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి దాడి చేసిన మిగతా నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు విద్యార్థి గోపాల్ హత్య నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అక్కడ అదనపు పోలీస్ బలగాలను మోహరించారు.