హైదరాబాద్ : నగరంలోని పంజాగుట్టకు చెందిన ఓ విద్యార్థి సైబర్సెక్స్ భారిన పడి మోసపోయాడు. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. బాధిత విద్యార్థి(20)కి 2020లో ఫేస్బుక్లో ఉమెన్ ప్రొఫైల్ కలిగివున్న ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ను అంగీకరించిన విద్యార్థి మెల్లగా చాటింగ్ చేయడం ప్రారంభించాడు. క్రమంగా ఇరువురి మధ్య స్నేహం బలపడింది. మొబైల్ నంబర్లు మార్చుకోవడంతో చాటింగ్ వాట్సప్లోకి మారింది.
అవతలి వ్యక్తి క్రమంగా సెక్స్ చాట్స్ చేయడం మొదలుపెట్టాడు. పలు యాప్స్ను ఉపయోగించి అసభ్య ఫోటోలు, వీడియోలను పంపించేవాడు. అవతల చాటింగ్ చేసేది మహిళే అని నమ్మిన యువకుడు ట్రాప్లో పడిపోయాడు. శరీరంపై సగం దుస్తువులతోనే చాటింగ్ చేయడం, తన ప్రైవేటు ఫోటోలు, వీడియోలను అవతలి వ్యక్తితో పంచుకోవడం చేశాడు. వీటన్నింటిని భద్రపరుచుకున్న అవతలి వ్యక్తి ఇగ బెదిరించడం ప్రారంభించాడు.
మొదటగా సోషల్ మీడియా ప్లాట్ఫాంపై షేర్ చేసి దాని లింక్ను విద్యార్థికి పంపించారు. ఇది చూసిన విద్యార్థి డెలిట్ చేయాల్సిందిగా వేడుకున్నాడు. అందుకు వాళ్లు రూ. 50 వేలు డిమాండ్ చేశారు. పలుమార్లు వేడుకోగా రూ. 25 వేలు ఇవ్వాల్సిందిగా తెలిపారు. ఈ మొత్తాన్ని విద్యార్థి వారు చెప్పిన బ్యాంక్ అకంట్కి పంపించాడు. కొన్ని రోజుల అనంతరం మళ్లీ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. దీంతో బాధిత విద్యార్థి హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.