ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక ఎంపీ ఒత్తిడి, అలసట వల్ల కొన్ని రోజులపాటు ఏకాంతంలోకి వెళ్లనున్నారు. ఎన్సీపీకి చెందిన పూణే జిల్లా షిరూర్ నియోజకవర్గం ఎంపీ అమోల్ కోల్హే ఈ నిర్ణయం తీసుకున్నారు. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా ఏకాంతంలోకి వెళ్తున్నానని, తాను తీసుకున్న కొన్ని తీవ్ర నిర్ణయాలను సమీక్షించుకుంటానని ఆయన తెలిపారు.
‘అవలోకనానికి సమయం: గత కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు తెలియకుండానే బిజీ జీవితంలో నేను పరుగులుతీశాను. కొన్ని తీవ్రమైన నిర్ణయాలు, ఊహించని చర్యలు తీసుకున్నాను. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు, చాలా బ్యాలెన్సింగ్ చర్యలు, టైమ్ మేనేజ్మెంట్ చేయాల్సి వచ్చింది. దీంతో చాలా ఒత్తిడికి లోనయ్యాను. వీటన్నింటి వల్ల నేను మానసికంగా, శారీరకంగా అలసిపోయాను’ అని సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు.
‘గతంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆలోచించాలి, పునరాలోచించాలి’ అని నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అమోల్ కోల్హే తెలిపారు. దాని కోసం తాను కొంత కాలం ఏకాంత జీవితం గడుపుతానని చెప్పారు. మానసిక ఒత్తిడి నుండి బయట పడేందుకు ధ్యానం, చింతన అవసరమన్నారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉంటానని, కొత్త శక్తి, ఉత్సాహంతో త్వరలో కలుస్తానని ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
కాగా, 2019 లోక్సభ ఎన్నికలకు ముందు అమోల్ కోల్హే శివసేనలో ఉన్నారు. టెలివిజన్ సీరియల్ ‘స్వరాజ్యరక్షక్ శంభాజీ’లో ఛత్రపతి శంభాజీ పాత్ర, ‘రాజా శివ్ ఛత్రపతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రతో ప్రజాదరణ పొందారు. మహారాష్ట్రను ఇంటి పేరుగా చేసుకున్నారు. అనంతరం ఎన్సీపీలో చేరిన కోల్హే, 2019 లోక్సభ ఎన్నికల్లో శివసేన అభ్యర్థి శివాజీరావు అధల్రావు పాటిల్పై ఘన విజయం సాధించారు.