హైదరాబాద్ : తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో మురుగుజల శుద్ధి ప్లాంట్లను (ఎస్టీపీ) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యావరణ, ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్ధ జలాలను శుద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నది. ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చొరవతో తొలివిడుతగా రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రధాన ఆసుపత్రుల్లో ఎస్టీపీలు నిర్మించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.134.46 కోట్లు ఖర్చు చేయనున్నది. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాటా రూ.52.59 కోట్లు. ఈ ఎస్టీపీలను ప్రభుత్వం అత్యాధునిక హైబ్రిడ్ యాన్యువిటీ మోడల్ (హెచ్ఏఎం)లో నిర్మిస్తున్నది. మరో నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అనంతరం నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. నిర్మాణ సంస్థలే పదేండ్ల పాటు ప్లాంట్లను నిర్వహించనున్నాయి.
హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, టిమ్స్, నీలోఫర్ ఆస్పత్రులతో పాటు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సూర్యపేట, నల్గొండ, ఆదిలాబాద్ రిమ్స్, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సిద్దిపేట మెడికల్ కాలేజి, ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మురుగు నీటి శుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
ఆస్పత్రుల నుంచి వివిధ రూపాల్లో విడుదలయ్యే వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు విడుదల చేయడం వల్ల నీటి కాలుష్యం జరుగుతుంది. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్స్, పేషంట్ల బెడ్ షీట్స్ ఉతికే సమయంలో, వార్డులను శుభ్రపరిచే సమయంలో వచ్చే వ్యర్ధ జలాలను ముందుగా డిస్ ఇన్ఫెక్ట్ చేసి ఎస్టీపీలకు పంపుతారు. అక్కడ నీటిని శుద్ది చేసి, పునర్వినియోగించుకునే విధంగా లేదా బయటికి వదులుతారు. ఇలా చేయడం వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయి.