మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి,
మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే!
(సౌందర్యలహరి-9)
అమ్మా! నీవు మూలాధారం నుంచి బయలువెడలి సహస్రారంలో నీ భర్త అయిన పరమశివుడితో రహస్యంగా కలసి విహరిస్తుంటావు. మూలాధార చక్రంలో కుండలినీశక్తి సర్పాకారంలో సుప్తావస్థలో ఉంటుంది. ఇక్కడినుంచే సుషుమ్న నాడి బయల్దేరుతుంది. కుండలిని నిద్రావస్థలో ఉన్నంతవరకు భౌతిక ప్రయోజనాల వెంట పరుగులు తీసే సాధకుడు కుండలినిని జాగృతం చేసి, శక్తి కేంద్రాలైన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు ఆరింటిలో ఉండే భూతత్వం, అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, మనస్తత్వాలను దాటి సహస్రారం చేరడం సాధనకు పరాకాష్ఠ.
ఈ ఆరు చక్రాలలో ప్రతి రెండు చక్రాలకు ఒక గ్రంథి ఉంటుంది. గ్రంథి అంటే చిక్కుముడి. మూలాధార-స్వాధిష్ఠానాల తర్వాత బ్రహ్మగ్రంథి, మణిపూర-అనాహతాల తర్వాత విష్ణుగ్రంథి, విశుద్ధి-ఆజ్ఞాచక్రాల తర్వాత రుద్ర గ్రంథి ఉంటాయి. ఈ మూడు గ్రంథులను వరు సగా స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలుగా పేర్కొన్నారు. అలాగే బ్రహ్మ అంటే సంకల్పం, విష్ణు అంటే పోషణ, రుద్ర అంటే లయం.. ఈ మూడింటినీ దాటాక సాధకుడికి లభించేది అమృతత్వం. ఈ మూడింటిని అవస్థాత్రయంగా కూడా చెప్తారు. అవి నిద్రావస్థ, ప్రయాణా వస్థ, సుఖావస్థ. మూడు గ్రంథులను ఛేదించి, మూడు అవస్థలను దాటి సహస్రారంలో చేరిన కుండలినీ శక్తి వల్ల సాధకుడు తేజస్వంతుడు అవుతాడు.
ఈ కుండలినీ శక్తినే పరదేవత, భగవతి, శాంభవి, హ్రీంకారి, త్రిపురసుందరి, త్రినయన అన్నాడు కాళిదాసు. ఒక్కొక్క చక్రంలో ప్రవేశించగానే సాధకునిలో ఒక్కొక్క శక్తి ఉద్దీపనమవుతుంది. మూలాధారం నుంచి స్వాధిష్ఠానం చేరగానే సాధకునిలో ‘అణిమ’ అనే సిద్ధి ఉద్దీప్తమవుతుంది. దానితో సాధకుడు పరమాణువు కన్నా సూక్ష్మంగా ఉండగలుగుతాడు. మణిపూరకంలో ప్రవేశించగానే ‘మహిమ, గరిమ’ అనే సిద్ధులు ఉద్దీప్తమవుతాయి. దానితో దివ్యత్వాన్ని సాధించగలుగుతాడు. అనాహతంలో ప్రవేశించగానే ‘లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం’ అనే శక్తులు ఉద్దీప్తమవుతాయి. దానితో అన్ని విషయాలు సాధకునికి అనుకూలంగా మారుతాయి.
విశుద్ధిలో ప్రవేశించగానే ‘ఈశత్వ’ సిద్ధి ఉద్దీప్త మవుతుంది. దానితో సృష్టి అంతటా తనను, తనలో సమస్త సృష్టినీ దర్శించగలిగే శక్తి కలుగుతుంది. ఆజ్ఞాచక్రంలో ప్రవేశించగానే వశిత్వ సిద్ధి ఉద్దీప్తమవుతుంది. దానితో సకల చరాచర జగత్తును శాసించగలిగిన సామర్థ్యం కలుగుతుంది. సమాధి స్థితి లేదా నిరతిశయ బ్రహ్మానంద స్థితి ఇక్కడే కలుగుతుంది. ఆ తాదాత్మ్య స్థితిలో కలిగిన పరవశంతో చాలామంది ఇక్కడే ఆగిపోతారు. కానీ, ఈ స్థితిని దాటి సహస్రారం చేరడం కొద్దిమందికే సాధ్యపడుతుంది. అలాంటివారు సహస్రారంలో అమ్మ కురిపించే అమృతధారలను పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.
అయితే, సాధనలో ఎలాగైతే అణిమాది అష్టసిద్ధులు ప్రవేశిస్తాయో అలాగే.. దంభం, దర్పం, దురభిమానం, క్రోధం, పరుషంగా మాట్లాడటం, అజ్ఞానం, ఆభిజాత్యం, సంపద వృద్ధి చేసుకోవడం అనే ఎనిమిది ఆసురీ శక్తులు కూడా ప్రవేశిస్తాయి. వీటిని ఆదరిస్తే పతనావస్థకు చేరుతారు. అందుకే సాధకులు ప్రలోభాలకు గురికాకుండా గమ్యం చేరాలని పెద్దలు హెచ్చరిస్తుంటారు. జీవించి ఉండగానే ఈ స్థితిని సాధించినవారు జీవన్ముక్తులు. మూలాధారంలో ఉండే శక్తి జీవాత్మ అని, సహస్రారంలో ఉండే శక్తి పరమాత్మ అని.. జీవాత్మ పరమాత్మల ఏకీభావమే రససిద్ధి అని చెప్తారు. లలితా సహస్రనామాలలో ‘కుళామృతైక రసికా’ అనే 90వ నామం నుంచి ‘బిసతంతుతనీయసి’ అనే 111వ నామం వరకు ఉన్న అమ్మ నామాలన్నీ ఈ శ్లోకంలో వివరించారు ఆదిశంకరులు. ఆ సహస్రార అధిష్ఠాన జనని మనందరికీ శ్రేయస్సును అనుగ్రహించుగాక.