Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ బలహీన పవనాల మధ్య వరుసగా నాలుగో రోజు నష్టాలు తప్పలేదు. ఇవాళ ఉదయం మార్కెట్ మొదలైన నుంచి నష్టాల్లోనే కొనసాగిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. ఉదయం 816 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది.
ఓ దశలో 57,708 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదు చేసిన సూచీ.. చివరకు 953.7 పాయింట్ల నష్టంతో 57,145 వద్ద ట్రేడింగ్ ముగిసింది. మరో వైపు నిఫ్టీ సైతం నష్టాల్లోనే కొనసాగింది. 311 పాయింట్లు నష్టపోయి, 17,016 వద్ద స్థిరపడింది. టాప్ గెయినర్స్గా ఏషియన్ పేయింట్స్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, దివిస్ ల్యాబ్, ఆల్ట్రాటెక్ సిమెంట్ నిలువగా.. టాప్ లూజర్స్గా టాటా మోటార్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, మారుతీ సుజూకీ, ఐచర్ మోటార్స్ నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో కొనసాగాయి.