ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో 214 పాయింట్లు క్షీణించి 54,892 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 16,356 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇవాళ ఆర్బీఐ రెపోరేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచేందుకు ద్రవ్యపరపతి సంఘం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. 50 బేసీస్ పాయింట్ల పెంపుతో రెపో రేటు 4.90 శాతానికి చేరింది. రెపోరేటు
పెంపుతో వడ్డీ రేట్లు పెరగనున్నాయి. రెపోరేటు పెంచడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి.
గ్లోబల్ మార్కెట్లో సానుకూల పవనాలు లేకపోవడంతో బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం సైతం నష్టాల్లోనే ముగిశాయి. అయితే, ఆర్బీఐ రెపోరేటు పెంచడంపై లాడెరప్ వెల్త్ మేనేజ్మెంట్ ప్రైవేట్ మేనేజింగ్ డైరెక్టర్ రాఘవేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఆర్బీఐ నిర్ణయం మార్కెట్ను ఆశ్చర్యానికి గురి చేసిందని, మూడ్ను మార్చివేసిందన్నారు. ఇవాళ్టి ట్రేడింగ్లో భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ నష్టపోగా.. టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, టైటాన్ లాభపడ్డాయి.