ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రష్యా అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలు, ఉక్రెయిన్లో రష్యా దాడుల మధ్య ఇవాళ స్టాక్మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమైనా చివరకు పుంజుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 389 పాయింట్ల లాభంతో 56,247 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 16,787 వద్ద ట్రేడింగ్ ముగిసింది.
అంతకుముందు, బీఎస్ఈ సెన్సెక్స్ 762 పాయింట్లు నష్టపోయి 55,096 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 221 పాయింట్లు క్షీణించి 16,437 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. గత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం, భారత స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్తో ప్రారంభమై, ఒక రోజు ట్రేడింగ్ తర్వాత చివరకు పెరుగుదలతో ముగిసింది. అలాగే క్యాపిటల్ మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో రూపాయి మారకం విలువ రూ.75.35 వద్ద కొనసాగుతున్నది.
అయితే, ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఓ వైపు శాంతి చర్చలకు పిలుపునిచ్చి రష్యా అధ్యక్షుడు పుతిన్.. మరో వైపు అణ్వస్త్రాలతో సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి నేపథ్యంలో సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత మదుపరులు కొనుగోళ్లకు ఉపక్రమించడంతో పాటు రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల నేపథ్యంలో.. రష్యా దాడులు తగ్గించిందన్న వార్తల మధ్య స్టాక్మార్కెట్లు కోలుకున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, పవర్గ్రిడ్, రిలయన్స్, టైటన్, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, కొటక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఆటో, బ్యాకింగ్, ఆర్థిరంగాల షేర్లు నష్టపోగా.. లోహ, ఇంధన, బేసిక్ మెటీరియల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇన్ఫ్రా రంగాల షేర్లు లాభపడ్డాయి.