హైదరాబాద్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వాగ్దానం చేసిన మరో ప్రాజెక్టు విషయంలో మొండిచేయి చూపింది. మహబూబాబాద్ జిల్లాలో నెలకొల్పుతానని చెప్పిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాల వివరాలను వెల్లడించేందుకు మంత్రి కిషన్రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బయ్యారం స్టీల్ ప్లాంట్ రద్దు చేశామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కానప్పుడు ఎలా ముందుకెళ్లగలమని ఆయన వ్యాఖ్యానించారు. బయ్యారం స్టాల్ ప్లాంట్ ఏర్పాటుచేస్తామని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎలక్షన్ మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన సంగతి నిజమేనని అన్నారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీని కూడా పునఃప్రారంభిస్తామని అప్పుడు వాగ్దానం చేశామని వెల్లడించారు. అవి తమ ప్రభుత్వానికి సాధ్యం కానందువల్లనే అమలు చేయలేకపోయామని పేర్కొన్నారు.