న్యూఢిల్లీ: స్వదేశీ కరోనా టీకాల సరఫరా అస్తవ్యస్తంగా, అరకొరగా ఉండడంతో రాష్ట్రాలు ఒక్కొక్కటిగా అంతర్జాతీయ మార్కెట్ వైపు దృష్టి సారిస్తున్నాయి. తెలంగాణ సర్కారు బయటి దేశాల నుంచి టీకాలు తెప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాతోపాటుగా బీజేపీ పాలనలో ఉన్న కర్నాటక, యూపీ కూడా ఇదే బాట పడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రాలకు 18 కోట్ల డోసులు సరఫరా చేసినట్టు కేంద్రం ప్రకటించింది. మరో 7,29,610 డోసులు రెండుమూడు రోజుల్లో పంపిస్తామని అంటున్నది. ఇంకా 90 లక్షల డోసులు రాష్ట్రాల దగ్గర ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అంటున్నది.కానీ 130 కోట్ల జనాభా కలిగిన దేశానికి ఈ సరఫరాలు సరిపోవడం లేదు. చాలా రాష్ట్రాల్లో టీకాలకు కొరతగా ఉంది. దాంతో రెండో డోసు వారికే ప్రాధాన్య ఇవ్వాలని అనేక రాష్ట్రాలు నిర్ణయించుకుంటున్నాయి. లేకుంటే మొదటి డోసు వ్యర్థమైపోతుందనేదే ఈ ప్రాధాన్యతకు కారణం. ఇప్పటిదాకా కేంద్రం మీదే ఆధారపడ్డామని, అంతర్జాతీయ మార్కెట్ నుంచి తెప్పించుకోమని మాకు ఆదేశాలు వచ్చాయని కర్నాటక ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర కోవిడ్ టాస్క్పోర్స్ అధిపతి అశ్వథ్ నారాయణ్ తెలిపారు. 18-44 వయసుల వారికోసం 2 కోట్ల డోసులు తెప్పించబోతున్నారట. రాష్ట్ర ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లకు పోవాలని కేంద్ర సర్కారు వత్తిడి తెస్తున్నదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. కేంద్రం ఓవైపు మనదేశానికి అవసరమైన టీకాలను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇప్పుడేమో రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నదని ఆయన అన్నారు. అధిక నిధులున్న రాష్ట్రం సహజంగానే అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఎక్కువ టీకాలు తెప్పించుకుంటుందని, మిగతా రాష్ట్రాలు ఇబ్బంది పడాల్సి వస్తుందని సిసోడియా అన్నారు.