న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా వడ్డీరేట్లను పెంచింది. ఈ నెల 12 నుంచి అమలులోకి వచ్చేలా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో అత్యధిక మంది తీసుకునే ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి చేరుకున్నది.
అలాగే నెల కాలపరిమితి ఎంసీఎల్ఆర్ రేటు కూడా 20 బేసిస్ పాయింట్లు సవరించడంతో 7.40 శాతానికి చేరుకోగా, మూడు, ఆరు నెలల రుణాలపై వడ్డీని 10 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో రుణ రేటు 7.45 శాతానికి, 7.55 శాతానికి చేరుకున్నాయి. ఒవర్నైట్ కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 0.05 శాతం పెంచడంతో వడ్డీరేటు 6.85 శాతానికి చేరుకున్నది.