హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు యాజమాన్యం తీపికబురు అందించింది. దీపావళికి ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.76,500 బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కార్మికులకు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 21న రూ.296 కోట్లను కార్మికులకు దీపావళి బోనస్గా చెల్లించనున్నట్టు సీఎండీ ప్రకటించారు. కార్మికుల సంక్షేమమే సింగరేణికి తొలి ప్రాధాన్యమని తెలిపారు. గతేడాది ఉత్పత్తి లక్ష్యసాధనలో గణనీయమైన వృద్ధి సాధించామని, ఇందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో లాభాల్లో 30 శాతం వాటాను (రూ.368 కోట్లు) దసరా బోనస్గా అందించామని గుర్తుచేశారు.
దసరా, దీపావళికి కలిపి ఒక్కో కార్మికుడికి సుమారు రూ.1.65 లక్షలు అం దాయని వివరించారు. ఈ సొమ్ము ను కార్మికులు కుటుంబసంక్షేమం కోసం పొదుపు చేసుకోవాలని సూచించారు. కష్టపడి పనిచేస్తే ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించవచ్చని, తద్వారా సింగరేణికి, కార్మికుని కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఇదే స్ఫూ ర్తితో ఈ ఏడాది సైతం ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. దేశంలో తెలంగాణలో మాత్రమే లాభాల వాటా బోనస్ను కార్మికులకు చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు సింగరేణి కార్మికుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.