నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మునుగోడులో బీజేపీకీ ఓటేస్తే మోటర్లకు మీటర్లు తప్పవని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేందంటూ ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్లాడుతున్నాడని గుర్తుచేశారు. ఇదే జరిగితే గుజరాత్లో మాదిరిగా ఇక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లిలో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలుచేస్తున్న ఉచిత కరెంటు, రైతుబంధు, ఆసరా పెన్షన్ల వంటి పథకాలేవీ గుజరాత్లో లేవన్నారు. ప్రధాని మోదీ, అమిత్షా సొంత రాష్ట్రంలోనే ఇలా ఉంటే ఇక్కడ బీజేపీ వాళ్లు టీఆర్ఎస్ కంటే గొప్పగా ఏం చేయగలరో ప్రజలు ఆలోచించాలని కోరారు. మునుగోడు ఫ్లోరైడ్ గురించి అప్పట్లో వాజ్పేయిని అడిగితే పట్టించుకోలేదని గుర్తు చేశారు.
కేసీఆర్ సీఎం అయ్యాక కృష్ణాజలాలు ఇస్తూ ఫ్లోరైడ్ను అంతమొందించారని చెప్పారు. టీఆర్ఎస్ హయాంలోనే మునుగోడు అభివృద్ధి జరిగిందని, మరోసారి గెలిపిస్తే మిగిలి ఉన్న పనులు పూర్తి చేసుకోవచ్చని సూచించారు. గతంలో మాదిరిగా రాజగోపాల్రెడ్డి మరోసారి మోసపు మాటలతో తిరుగుతున్నాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీకి దిక్కూదివాన లేదని, నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్నదని ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని, మునుగోడులో అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ను గెలిపించుకుందామని పార్టీ శ్రేణులకు మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నాంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజనాలు ఉత్సాహాభరిత వాతావరణంలో సాగాయి. మండలం పరిధిలోని గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులు కలిసి తరలిరావడంతో నాంపల్లి గులాబీమయంగా మారింది. తెలంగాణ సాధన ఉద్యమ ఘట్టాలను, స్వరాష్ట్రంలో అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు టీఆర్ఎస్ శ్రేణులను అలరించాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆట సందీప్ బృందం కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యకర్తల నుంచి చప్పట్లతో మంచి స్పందన లభించింది. పేరణి శివతాండవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమ్మేళనంలో భాగంగా నాంపల్లి హైస్కూల్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు, యువతులు బతుకమ్మలతో, భోనాలతో తరలివచ్చారు.
మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఆటోలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లు, బైక్లపై కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావడంతో సభలో వేసిన కుర్చీలు చాలక చాలామంది ప్రాంగణం చుట్టూ నిలబడి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ… నాయకుల ప్రసంగాలను ఆలకించారు. వచ్చిన వారు వచ్చినట్టు సమాయానికి భోజనం చేసేలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఆత్మీయ సమ్మేళనం నిరాటంకంగా సాగింది. పార్టీ సభ్యులందరినీ కుటుంబసభ్యులుగా భావించే టీఆర్ఎస్ వన భోజనాలతో మరోసారి కార్యకర్తల పట్ల నిబద్ధ్దతను చాటింది. తమ ఇంటి పండుగకు మాదిరిగా కార్యకర్తలు వెల్లువలా రావడంతో ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది.