ఈసారి పొట్టి ప్రపంచకప్ మొదలవడానికి ముందే భారత జట్టుకు గట్టి షాక్లు తగులుతున్నాయి. టోర్నీ ఆరంభానికి నెలరోజుల ముందే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. వెన్నుగాయం నుంచి కోలుకున్నాడని అనుకున్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు గాయం తిరగబెట్టింది. దాంతో అతను కూడా మెగాటోర్నీకి దూరమయ్యాడు.
ఇలాంటి సమయంలో బుమ్రా స్థానాన్ని భర్తీ చేస్తాడని అనుకున్న దీపక్ చాహర్ కూడా వెన్నునొప్పితో ప్రపంచకప్ ఆడటం లేదని తెలుస్తోంది. గాయం వల్ల చాలా గ్యాప్ తీసుకొని అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న చాహర్.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించాడు. అయితే వన్డే సిరీస్ ముందు వెన్నునొప్పితో జట్టుకు దూరమయ్యాడు. దీంతో బుమ్రా స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే తలనొప్పి మళ్లీ మొదలైంది.
ప్రస్తుతానికైతే వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ముందు కరోనా బారిన పడిన అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అదే సమయంలో సఫారీలతో వన్డే సిరీస్లో మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో ఆకట్టుకున్నాడు. దీంతో వీళ్లు ముగ్గుర్నీ ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ భావిస్తోందట. బుమ్రా స్థానంలో ఆడే ఆటగాడి పేరు ప్రకటించడానికి అక్టోబర్ 15 వరకు గడువు ఉంది. ఈ క్రమంలోనే ముగ్గుర్నీ ఆసీస్ పంపేసి, అక్కడ వాళ్ల ప్రదర్శనను బట్టి ఎవరో ఒకర్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.