చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈ సారి కూడా కొలతూర్ నియోజకవర్గం నుంచే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు ఆయన తన అభీష్టాన్ని తెలుపుతూ డీఎంకే ఎన్నికల కమిటీకి అధికారిక లేఖ రాశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను కొలతూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. కాగా, స్టాలిన్ ఇప్పటికే రెండుసార్లు కొలతూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరితోపాటు తమిళనాడు అసెంబ్లీకి కూడా వచ్చే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగనున్నాయి.