ఇల్లందు: ఈ ప్రాంత అభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వానికి అండగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేసేందుకు నేతలంతా కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అధ్యక్షతన జరిగిన పార్టీ సంస్థాగత సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ఇతర పార్టీల నుంచి నేతలు గులాబీ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు తీసుకున్నదని గుర్తు చేశారు. అభివృద్ధిని చూసే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న హరిప్రియ నాయక్ కూడా టీఆర్ఎస్ లో చేరిన విషయం మనందరికీ తెలిసిందేనని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గ్రామ కమిటీల్లో అవకాశం లభించకపోతే.. మండల కమిటీల్లో అవకాశం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేదే బాధ్యత అని సూచించారు. జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అనుభవాన్ని అందరూ స్వీకరించాలని, మనమంతా కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నరేశ్ రెడ్డి, తాత మధు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, జిల్లా నేతలు దిండిగల రాజేందర్, వేణు, హరిసింగ్, వీవీ, జానీ పాల్గొన్నారు.