Srisailam | సూర్యగ్రహణం కారణంగా శ్రీశైల ప్రధాన ఆలయంతోపాటు పరివార దేవతాలయాలు కూడా ఈ నెల 25న పూర్తిగా మూసివేస్తున్నట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఈ నెల 25 మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి స్వామిఅమ్మవార్లకు మంగళవాయిద్యాలతో సూప్రభాతసేవ, మహా మంగళ హారతులు అందిస్తారు.
అటుపై అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు ఈవో లవన్న చెప్పారు. అదే విధంగా సాయంత్రం ఆరు గంటల తరువాత ఆలయ శుద్ది, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలతో స్వామి అమ్మవార్ల కైంకర్యాలు యదావిధిగా జరుగుతాయని తెలిపారు.
గ్రహణం కారణంగా పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసి, భక్తులకు కూడా కేవలం స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నట్లు లవన్న పేర్కొన్నారు. ప్రధానాలయంలోని పరివార దేవతాలయాలతోపాటు సాక్షిగణపతి, హఠకేశ్వరం, ఫాలధార – పంచధార మరియు శిఖరేశ్వరం ఉపాలయాలలో కూడా ఇదేవిధంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రహణ సమయంలో నిత్య అన్నదాన ప్రసాద వితరణ కూడా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.