శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలను జయప్రదం చేద్దామని ఆలయ ఈవో లవన్న పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచే కాకుండా ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే యాత్రికులకు అవసరమైన వసతులు కల్పిద్దామన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ట్రస్ట్బోర్డు సభ్యుల సమక్షంలో ఉగాది ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన ఉత్సవాల్లో లోటుపాట్లను పరిగణలోకి తీసుకుని ఈసారి చేపట్టిన ముందస్తు ప్రణాళికను వివరించారు. అంతేకాకుండా మండలి సలహాలను కూడా అడిగి తెలుసుకుని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు.
కాలినడక భక్తులకు కంకణధారణ
వివిధ ప్రాంతాల నుంచి శివనామస్మరణ చేస్తూ కాలినడకన వచ్చే భక్తులకు కైలాసద్వారం వద్ద దేవస్థానం వారు కంకణ ధారణ చేస్తున్నారు. స్వామి, అమ్మవార్ల స్పర్శ దర్శనానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతుండగా కాలినడక భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఆలయ ప్రవేశం కల్పిస్తున్నారు.
శ్రీశైలంలో చిరువ్యాపారుల హల్చల్..
శ్రీశైలం మహాక్షేత్రానికి తోపుడుబండ్లతో వచ్చిన చిరువ్యాపారులు హల్చల్ చేస్తూ వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నందిసర్కిల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఈవో లవన్న స్వయంగా జోక్యం చేసుకుని.. తోపుడుబండ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఉన్నాయా? అని వారిని ప్రశ్నించారు. అలాగే, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆలయ రెవెన్యూ అధికారులు, ముఖ్య భద్రతా అధికారి నర్సింహారెడ్డిని ఆదేశించారు. గత ఉత్సవాల్లో తాత్కాలిక షాపులు, తోపుడుబండ్ల వల్ల దేవస్థానానికి నష్టం వాటిల్లిందని, అలాంటివి పునరావృతం కాకుండా వ్యాపారానుసారంగా తగిన రుసుము వసూలు చేయాలని సూచించారు.