శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులతో పాటు దేవస్థాన సిబ్బందికి శుద్దమైన మంచినీరు అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని ఆలయ ఈవో కేఎస్ రామారావు అన్నారు. మంగళవారం క్షేత్ర పరిధిలోని ఫిల్టర్ హౌజ్ లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. వరద ప్రవాహం వసున్నందున ముందస్తుగానే అప్రమత్తమై త్రాగునీటి శుద్ధీకరణపై ప్రత్యేక దృష్టి ఉంచాలని అధికారులకు సూచనలు చెశారు. అత్యాధునిక ప్రమాణాలను పాటిస్తూ మంచినీటిని అందరికీ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేవస్థానం నిర్మించిన లక్షల లీటర్ల నీటి సామర్ధ్యం గల ఫిల్టర్ బెడ్లను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సిద్ధం చేస్తూ క్లోరినేషన్ చెయ్యాలని చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల కోసం ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సుజల కేంద్రాలను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి ఉంచాలని ఆదేశించారు. ఈవో వెంట ఈఈ మురళీ బాలకృష్ణ, డీఈఈ శ్రీనివాసరెడ్డి, ఏఈ రాజేష్ ఉన్నారు.