34 టీఎంసీలకు మించి తరలించకుండా ఆంధ్రప్రదేశ్ను కట్టడిచేయాలి
మాకన్నా 15 రెట్లు ఎకువగా తీసుకొనే సామర్థ్యం ఏపీకి ఉంది
కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం రిజర్వాయర్లో కనీస నీటిమట్టం 830 అడుగులుగా నిర్ధారించాలని తెలంగాణ మరోసారి గుర్తు చేసింది. రూల్కర్వ్లో భాగంగా శ్రీశైలంలో 854 అడుగులుగా కనీస నీటిమట్టం ఉండాలని ఏపీ వాదిస్తుండటంతో తెలంగాణ కౌంటర్ ఇచ్చింది. ఈ జలాశయం నుంచి 34 టీఎంసీలకు మించి నీటిని ఏపీ తరలించకుండా అడ్డుకోవాలని స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఈ నెల 1న నిర్వహించిన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశంలో చర్చించిన అంశాల సారాంశం తెలంగాణకు చేరడంతో, బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్కు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. రూల్కర్వ్ను ఆమోదించడానికి ముందు శ్రీశైలం రిజర్వాయర్లో కనీస నీటిమట్టం 830 అడుగులుగా మాత్రమే ఉండాలని గుర్తుచేశారు.
శ్రీశైలంలో 75% డిపెండబులిటీ ఆధారంగా తెలంగాణ అవసరాల కింద ఎస్ఎల్బీసీకి 40 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 40 టీఎంసీలు, నెట్టెంపాడుకు 25.4 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 30 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 30 టీఎంసీలు కేటాయించాలని కోరారు. శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణం జరిగిందే జలవిద్యుత్తు అవసరాల కోసమని పునరుద్ఘాటించారు. నాగార్జునసాగర్ నీటి అవసరాలు తీర్చడానికే శ్రీశైలంలో జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామని, 168 టీఎంసీలను వినియోగించి.. ఆ నీటితో జలవిద్యుత్తు ఉత్పత్తి చేసే అధికారం తెలంగాణకు ఉన్నదని, ఏపీ 54 టీఎంసీలకు మించి నీటిని జలవిద్యుత్తు కోసం వినియోగించడానికి వీల్లేదని చెప్పారు.
ఏపీలో 360 టీఎంసీల సామర్థ్య జలాశయాలు
బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్-6తో పాటు 13 ప్రకారం మళ్లించే ప్రతి చుకనీటిని లెకించాలని ఈఎన్సీ స్పష్టంచేశారు. శ్రీశైలం నుంచి రోజుకు 4.22 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యం ఏపీకి ఉన్నదని, తెలంగాణకు రోజుకు 0.27 టీఎంసీలే తరలించగలదని తెలిపారు. ఏపీ ఏకంగా 360 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలు కట్టుకొని, కృష్ణా జలాలను తరలిస్తున్నారని నివేదించారు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున.. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రొటోకాల్స్పై ఏ నిర్ణయం తీసుకోజాలరని పేరొన్నారు. వరదల అనంతరం శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటిని వాడుకోవడానికి తెలంగాణకు అనుమతినివ్వాలని కోరారు. తదుపరి ఆర్ఎంసీ సమావేశం నిర్వహించే ముందు, తాము నివేదించిన అన్ని అంశాలపై తుది నిర్ణయం తీసుకున్నాకే ముందుకెళ్లాలని కృష్ణాబోర్డు సమావేశంలో ఈ అంశాలన్నీ ఎజెండాగా చేర్చాలని స్పష్టంచేశారు.
ఆర్డీఎస్ పనులను అడ్డుకోండి
కేఆర్ఎంబీకి ఈఎన్సీ మరో లేఖ
ఏపీ ప్రభుత్వం అక్రమంగా కొనసాగిస్తున్న రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) కుడికాలువ పనులను వెంటనే అడ్డుకోవాలని కేఆర్ఎంబీని మరోసారి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈఎన్సీ మురళీధర్ మంగళవారం కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఏపీ పనుల కొనసాగింపుపై ఇప్పటికే పలుమార్లు లేఖలు రాశామని గుర్తుచేశారు. గతేడాది జూన్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా హెడ్ రెగ్యులేటర్ పనులు కొసాగుతున్న ఆధారాలను కేఆర్ఎంబీకి సమర్పించామని పేర్కొన్నారు. అయినా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని ఆరోపించారు. తాజాగా తీసిన ఫొటోలను బట్టి హెడ్ రెగ్యులేటరీ పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. ఏపీ అక్రమంగా పనులు కొసాగించడం విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేఆర్ఎంబీ స్పందించి ఏపీ అక్రమ పనులను అడ్డుకోవాలని కోరారు. అనుబంధంగా హెడ్ రెగ్యులేటరీ ఫొటోలను, నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాన్ని జత చేశారు.