శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు గురువారం మూడు గేట్ల ద్వారా మాత్రమే నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా తగ్గిస్తూ మధ్యాహ్నం గేట్లను పూర్తిగా మూసివేశారు. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 28,238, విద్యుదుత్పత్తి ద్వారా 42,363, సుంకేసుల నుంచి 25,866 క్యూసెక్కుల నీరు విడుదల కాగా, సాయంత్రానికి 98,765 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది.
అలాగే, ఏపీ పవర్హౌస్లో 23,304, టీఎస్ పవర్హౌస్లో 31,784 క్యూసెక్కుల నీటితో విద్యుదుత్పత్తి చేసుకుని, దిగువన ఉన్న నాగార్జున సాగర్కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.40 అడుగులవరకు నీరుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.43 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.