Vijaya Dashami 2022 | శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు మహార్నవమి సందర్బంగా భ్రామరీ అమ్మవారిని సిద్దిదాయిని రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశ్వవాహనంపై ప్రత్యేక పూజలు అందుకుని భక్తులకు దర్శనమిచ్చింది. సాయంత్రం అక్క మహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంపై ఆశీనులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు రుత్వికులచే శాస్త్రోక్త పూజలు జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు.
సిద్దిదాయిని అలంకారంలో చతుర్బుజాలను కలిగి కుడివైపు చక్రము, గద, ఎడమవైపు శంఖము, పద్మాలను ధరించి భక్తులకు అభయమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో క్షేత్రం సందడిగా మారింది. ఆలయ ప్రాకారోత్సవంతోపాటు గ్రామోత్సవంలో అశ్వవాహనాధీశులైన స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారులతో పాటు జానపదాలు, కోలాటాలు, చెక్క భజన, బీరప్ప డోలు, నందికోలు, బుట్టబొమ్మలు, ఢమరుకనాదాలు, సప్తస్వర విన్యాసాలు, కర్ణాటక డప్పు కళాకారుల వీరంగ నృత్యాలతోపాటు వివిధ రకాల కళారూపాలతో సందడితో ఉత్సవం కొనసాగింది. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ, ఏకాంత సేవలు జరిగాయి.
హైదరాబాద్కు చెందిన వై. రవిప్రసాద్ – శారద దంపతులు అందించిన రూ.50 లక్షల విరాళంతో ఆలయ పుష్కరిణిలో నూతన నీరాజన మండపాన్ని ప్రారంభించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో మంత్రిచే రాతినీరాజన మండపాన్ని ప్రారంభించారు. అనంతరం 2023 వార్షిక క్యాలెండర్తోపాటు పంచాంగం కలిగిన ప్రతులు, టేబుల్ క్యాలెండర్లను ప్రారంభించారు.