Dasara Celebrations in Srisailam | శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్బంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఐదో రోజైన శుక్రవారం భ్రమరాంబాదేవి స్కందమాతగా భక్తులను అనుగ్రహించింది. స్కందమాతగా సింహవాహనంపై ఆసీనురాలై చతుర్బుజాలు కలిగి పద్మం, కమలం, అభయహస్తం, ఒడిలో బాల షణ్ముఖుడైన కుమారస్వామి (స్కందుడు) ని ధరించి భక్తులకు దర్శనమిచ్చింది. శేషవాహనంపై శ్రీశైల మల్లన్నతో కలిసి భక్తులను కరుణించింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో శేషవాహనం అధిష్టించిన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారికి ప్రధాన అర్చకులు వేదపండితులు వాహనసేవను వైభవంగా జరిపించారు. అలంకీకృతమైన స్కందమాత మల్లికార్జున స్వామి అమ్మవార్లను భక్తులు కనువిందుగా దర్శించుకున్నారు. అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ జరిపించారు.
రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామోత్సవం, ఆలయ ప్రాకారోత్సవం పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను ఆసీనులజేసి వేదపండితులు మహా సంకల్పాన్ని పఠించారు.
సాయంత్రం ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన నృత్యాలు, సంగీత విభావరిని భక్తులు ఆద్యంతం తిలకించారు.
శరన్నవరాత్రుల్లో ఆరో రోజు శనివారం భ్రమరాంబాదేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమివ్వగా మల్లికార్జున స్వామివారికి హంసవాహసేవ నిర్వహించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు.