శ్రీశైలం : ద్వాదశజ్యోతిర్లింగం… అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి కేఎస్. రామారావు గురువారం ఉదయం సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో ఆలయ ముఖద్వారం నుండి ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం యాగశాల ప్రవేశం చేసి, గణపతిపూజ, మండపారాధన తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం శివసంకల్పాన్ని పఠించిన వేదపండితులు అతివృష్టి, అనావృష్టి నివారించబడి పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఋత్వికులు సంకల్పాన్ని పఠించారు.
ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని తొలుత గణపతి పూజ, చండీశ్వర పూజ, కంకణ పూజ, కంకణ ధారణ, ఋత్విగ్వరణం, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తు హోమం, ప్రధాన కళశ స్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని మట్టిని తీసుకుని 9 పాలికలలో వేసి నవ ధాన్యాలను అంకురారోపింపజేసే క్రతువును ఘనంగా చేశారు. ఆ తరువాత ధ్వజారోహణలో భాగంగా నూతన వస్త్రంపై పరమశివుని వాహనమైన నందీశ్వరుని ప్రతిమ, అష్టమంగళాలను చిత్రించిన నంది ధ్వజపటాన్నిధ్వజస్తంభంపై పతాకావిష్కరణ గావించారు. చండీశ్వరస్వామి సమక్షంలో ప్రత్యేక పూజాధికాలు చేశారు.
అనంతరం భేరి పూజ చేసి మేళతాళాల రాగాలతో సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ఆనవాయితీ అని ప్రధాన అర్చకులు తెలిపారు. ఉత్సవాలకు హాజరయ్యేందుకు విచ్చేసే యక్ష, గంధర్వ గణాలకు ఆలయ ప్రాంగణంలో నిర్ణీత స్థలాలు కేటాయించి నిత్యోత్సవ పూజలు జరుపుతారని ఈవో కేఎస్ రామారావు తెలిపారు.