హైదరాబాద్ : నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 95,761 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. ఎగువన విష్ణుపురి రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తివేయడంతో భారీగా జలాశయంలోకి వరద వచ్చి చేరుతోంది. త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,078.80 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 39.23 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ప్రవాహం వస్తుండడంతో ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.