తిరుమల : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో మంగళవారం వరాహ జయంతి జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేయనున్నారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం చేస్తారు. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం వరాహస్వామి జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తున్నది. స్థలమహత్యం ప్రకారం.. తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన వరాహస్వామివారికే చేస్తారు. భక్తులు ముందుగా భూవరాహస్వామివారిని, ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం. మహావిష్ణువు లోక కల్యాణం కోసం వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.