కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి గురువారం సాయంత్రం సింగపూర్ చేరుకున్న ఆయన స్పీకర్ మహింద యాపా అబేవర్దనకు తన రాజీనామాను ఈ మెయిల్ ద్వారా పంపారు. అయితే ఈ మెయిల్ ద్వారా పంపిన ఆయన రాజీనామాను ఆమోదిస్తారా లేదా అన్నది స్పష్టం కాలేదు. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున ఆ దేశాన్ని వీడిన గొటబయ తన భార్యతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు వెళ్లారు. అయితే అక్కడ కూడా నిరసన సెగ తగిలింది. మాలేలోని శ్రీలంక వాసులు బుధవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ‘గొటబయ గో’ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రతిపక్ష పార్టీ కూడా ఆయన రాకను వ్యతిరేకించింది. దీంతో తమ దేశం విడిచి వెళ్లాలని మాల్దీవుల ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో గొటబయ రాజపక్సే తన భార్య లోమా, ఇద్దరు బాడీ గార్డులతో కలిసి సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో గురువారం సాయంత్రం సింగపూర్కు చేరుకున్నారు. అయితే గొటబయ రాజపక్సేకు రాజకీయ ఆశ్రయం ఇవ్వడం లేదని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యక్తిగత పర్యటన కోసమే ఆయన సింగపూర్కు వచ్చినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఆయన (గొటబయ) ఆశ్రయం కోరలేదు. ఆయనకు ఎలాంటి ఆశ్రయం ఇవ్వలేదు. సాధారణంగా ఆశ్రయం కోసం చేసే అభ్యర్థనలను సింగపూర్ మంజూరు చేయదు’ అని విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.