కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి రోజు 10 గంటల పాటు విద్యుత్తు కోతను విధించనున్నట్లు ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ మారక నిలువలు అడుగంటిపోవడంతో.. ఆ దేశంలో తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో వేలాది మంది ఇంధనం కోసం క్యూలైన్లు కడుతున్నారు. దిగుమతి ఆంక్షలు ఉన్న నేపథ్యంలో అన్ని నిత్యావసరాల సరఫరాలోనూ కొరత ఏర్పడింది. ఇక పవర్ కట్స్ను రోజుకు 10 గంటలు చేస్తున్నట్లు ఇవాళ అధికారులు తెలిపారు.
ఈ నెల ఆరంభం నుంచి శ్రీలంకలో రోజుకు ఏడు గంటల పాటు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. థర్మల్ పవర్ను జనరేట్ చేసేందుకు కావాల్సిన ఇంధనం లేదని, అందుకే 750 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రభుత్వం త్వరలో ఆరు వేల మెట్రిక్ టన్నుల డీజిల్ను ఎల్ఐఓసీ వద్ద కొనుగోలు చేయనున్నట్లు ఇంధనశాఖ మంత్రి గామిని లోకుజే తెలిపారు. విదేశీ మారకం లేకపోవడంతో.. శ్రీలంక ప్రస్తుతం మందులు కొనలేని పరిస్థితిలో ఉంది. అయితే శ్రీలంకకు తక్షణ సాయం చేయనున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.