స్టార్లతో నిండి ఉన్న భారత్, పాకిస్థాన్ వంటి జట్లను ఓడించి ఇటీవలే ఆసియాకప్ చేజిక్కించుకున్న శ్రీలంక జట్టు.. టీ20 ప్రపంచకప్ను పేలవంగా ప్రారంభించింది. నేరుగా సూపర్-12కు అర్హత సాధించలేకపోయిన మాజీ ప్రపంచ చాంపియన్.. క్వాలిఫయింగ్ రౌండ్ తొలి మ్యాచ్లో నమీబియా చేతిలో ఓటమి పాలైంది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మరోపోరులో యూఏఈపై నెదర్లాండ్స్ విజయం సాధించింది.
జిలాంగ్: టాపార్డర్ విఫలమవడంతో టీ20 వరల్డ్కప్ ఆరంభ పోరులో శ్రీలంక పరాజయం పాలైంది. గ్రూప్-‘ఎ’లో బాగంగా ఆదివారం జరిగిన పోరులో లంక 55 పరుగుల తేడాతో నమీబియా చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ (44), జేజే స్మిత్ (31 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో ప్రమోద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనలో లంక 19 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దసున్ షనక్ (29) ఒక్కడే కాస్త పోరాడాడు. పథుమ్ నిషాంక (9), కుషల్ మెండిస్ (6), ధనంజయ డిసిల్వ (12), ధనుష్క గుణతిలక (0) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుస కట్టడంతో లంక 40 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షనకతో కలిసి భానుక రాజపక్స (20) కాస్త పోరాడటంతో ఏమూలో ఆశలు చిగురించినా.. అవి ఎక్కువసేపు నిలువలేదు. ఆ తర్వాత హసరంగ (4), చమిక కరుణరత్నె (5) ఔటయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. నమీబియా బౌలర్లలో డేవిడ్ వైస్, బెర్నార్డ్, షికాంగో, ఫ్రైలింక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన నమీబియా ఆటగాడు ఫ్రైలింక్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్-‘ఎ’లో భాగంగా యూఏఈతో జరిగిన పోరులో నెదర్లాండ్స్ గెలిచింది. బౌలర్ల హవా సాగిన పోరులో ఇరు జట్లు విజయం కోసం తుదికంటా పోరాడాయి. మొదట యూఏఈ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. వసీమ్ (41) టాప్ స్కోరర్. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ 3, క్లాసెన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం చేజింగ్లో నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 112 రన్స్ చేసింది.