కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఇంకా కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రధాని మహింద రాజపక్స పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్కు తలొగ్గి.. ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ప్రధాని మహింద రాజపక్స ఆయన సోదరుడు, అధ్యక్షుడు గోటబయ రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మహింద రాజపక్స తన సొంత పార్టీ ‘శ్రీలంక పొదుజన పెరమున’ నుంచి సైతం రాజీనామా చేయాలని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
శ్రీలంకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని రాజీనామా ఉపకరిస్తుందని అధ్యక్షుడు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు తాతాల్కిక ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. గోటబయ రాజపక్స అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో శ్రీలంక ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు మహింద రాజపక్స అంగీకరించినట్లు కొలంబో పేజ్ పేర్కొంది. కావాలంటే రాజీనామా చేస్తానని గతంలో పలుసార్లు మహింద ప్రకటించారు. సమాచారం మేరకు.. శ్రీలంక కేబినెట్ మంత్రులు ప్రసన్న రణతుంగ, నలక గోదాహెవా, రమేశ్ పతిరానా రాజీనామా చేయాలనే మహింద రాజపక్స నిర్ణయాన్ని అంగీకరించారు.
సోమవారం ప్రత్యేక ప్రకటనలో మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తారని, ఆ తర్వాత వచ్చే వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గతంలో తీవ్ర ఒత్తిడి ఎదురైనా పదవికి రాజీనామా చేయడానికి మహింద రాజపక్స నిరాకరించారు. ఆదివారం అనురాధపూర్లో ప్రజల నుంచి నిరసనను ఎదుర్కొన్నారు. ఇంధనం, వంటగ్యాస్ సమస్యలను పరిష్కరించాలని, కరెంటు కోతలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రధాని తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రాజపక్స కుటుంబం మొత్తం రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.