హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్ టోర్నీకి శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) ప్లేయర్ సునీల్ బాతాల ఎంపికయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జన్మించిన సునీల్ అంచలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నాడు. గతేడాది డిసెంబర్లో ఎస్డీఎఫ్సీలో చేరిన సునీల్ క్లబ్ తరఫున ఐలీగ్లో ఆడబోతున్న తొలి ప్లేయర్గా నిలిచాడు. అండర్-16 భారత క్యాంప్లో జట్టు సభ్యుడైన సునీల్..ఎస్డీఎఫ్సీలో చేరిన తర్వాత మరింత మెరుగయ్యాడు. ముఖ్యంగా ఆటలో మెళకువలు నేర్చుకోవడంతో పాటు ఫిట్నెస్ పరంగా ప్రొఫెషనల్గా తయారయ్యాడు. ప్రతిభ కల్గిన యువ ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎస్డీఎఫ్సీ..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో చేపట్టిన శిక్షణ కార్యక్రమాల ద్వారా సునీల్ వెలుగులోకి వచ్చాడు. గతంలో జాతీయ అండర్-15 సబ్జూనియర్తో పాటు అండర్-16, అండర్-17, అండర్-19 జట్లకు ఈ యువ డిఫెండర్ ప్రాతినిధ్యం వహించాడు. ఐ-లీగ్ టోర్నీకి సునీల్ ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఎస్డీఎఫ్సీ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.