‘స్వచ్ఛమైన గోదావరి యాసలో నేను డైలాగ్స్ చెప్పిన మొదటి సినిమా ఇది. నా సంభాషణల్లో ఉండే వెటకారం ఆకట్టుకుంటుంది’ అని అన్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని దర్శకుడు. ఈ నెల 31న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో శ్రీవిష్ణు పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
గోదావరి జిల్లాల అనుబంధాలు, పల్లెటూరి సంస్కృతులను సహజంగా ఆవిష్కరిస్తూ రూపొందించిన చిత్రమిది. ఐదుగురు స్నేహితుల జీవితాలతో ముడిపడి ఆసక్తికరంగా సాగుతుంది. బతుకుతెరువు కోసం పట్టణాలకు వలసవెళ్లకుండా సొంత ఊరిలోనే కుటుంబసభ్యులతో సంతోషంగా జీవించాలనుకున్న వారికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ‘అర్జున ఫల్గుణ’ అనే పదం మహాభారతం నుంచి పుట్టింది అర్జున, ఫల్గుణ, పార్ధ, కృష్ణకి లాంటి పేర్లను తలుచుకుంటే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు వస్తాయని పురాణాల్లో గాథ ఉండేది. ఆ పదాల నుంచి స్ఫూర్తి పొందుతూ టైటిల్ను పెట్టుకున్నాం.
ఎన్టీఆర్ అభిమానిగా..
ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, చిరంజీవి, బాలకృష్ణతో పాటు ఇండస్ట్రీలోని ప్రతి హీరోను నేను గౌరవిస్తా. హీరోలపై నాకున్న అభిమానాన్ని చూపించే అవకాశం వస్తే వదులుకోను. ఈ సినిమాలో నేను ఎన్టీఆర్ అభిమానిగా కనిపిస్తా. ఆయన పట్ల ఉండే ఇష్టాన్ని సినిమా ద్వారా చూపించా.
ప్రయోగాలు చేయను..
రియలిస్టిక్ సినిమాలే నా బలం. ఆ పంథాను నా బలహీనతగా ఎప్పుడూ అనుకోలేదు.. హీరోలు తమ సుదీర్ఘకెరీర్లో నాలుగైదుకు మించి రియలిస్టిక్ సినిమాలు చేయలేరు. నాకు మాత్రం అన్ని సహజత్వ కథాంశాలే లభిస్తున్నాయి. ఇమేజ్కు మించిన అంశాలు కథలో ఉంటే వాటిని నా శైలికి తగినట్లుగా మార్చేస్తుంటా. తాము చూసిన పక్కింటి అబ్బాయి, గ్రామీణ యువకుడి జీవితాన్ని దర్శించినట్లుగా నా సినిమాలుంటాయని అందరూ ప్రశంసిస్తుంటారు. ప్రయోగాత్మక సినిమాలకు నేను ప్రాధాన్యతనివ్వను. సాధారణ కథలను కొత్తగా చెప్పడానికే ప్రయత్నిస్తా.
పోలీస్ బయోపిక్..
కెరీర్లో తొలిసారి పూర్తియాక్షన్ కథాంశంతో ‘భళాతందనాన’ సినిమా చేస్తున్నా. షూటింగ్ పూర్తయింది. లక్కీ మీడియా బ్యానర్లో పోలీస్ అధికారి జీవితకథతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నా. భిన్న జీవన దశల్ని ఆవిష్కరిస్తూ నవ్యరీతిలో సినిమా ఉంటుంది.