హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త కోర్టుల ఏర్పాటుతో పాటు కోర్టు భవనాల్లో మౌలిక వసతుల కల్పన, పోస్టుల మంజూరుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. న్యాయశాఖ పద్దులపై గురువారం మంత్రి అల్లోల అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన, ఖచ్చితమైన, సత్వర న్యాయం అందించేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో న్యాయశాఖ నిబద్ధతతో పని చేస్తుందన్నారు.
అత్యాచార, లైంగిక హింస నిరోధానికి సంబంధించిన పోక్సో చట్టం కింద నమోదైన కేసుల విచారణలో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనమతినివ్వడంతో పాటు 504 పోస్టులను మంజూరు చేసిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ ఏర్పాటు చేశారన్నారు.
ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 20,773 మంది న్యాయవాదులు, 58,835 మంది కుటుంబ సభ్యులు (న్యాయవాది, అతని లేదా ఆమె భాగస్వామి ఇద్దరు పిల్లలు) రూ.2 లక్షల మేరకు ఆరోగ్య బీమా పథకం వర్తింపజేయడం జరిగిందన్నారు. వీరిలో ఇప్పటి వరకు 4,213 మంది ఈ పాలసీ వినియోగించుకున్నారని తెలిపారు.
ఈ పథకం ద్వారా ప్రమాదంలో మరణించిన న్యాయవాదులకు ప్రమాద బీమా క్రింద వారి కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించడం జరుగుతుంది. ఈ పథకం పరిధిలో 21,336 మంది న్యాయవాద కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ ఇప్పటి వరకు రూ. 30.91 కోట్లు ఇన్సూరెన్స్ కోసం వెచ్చించిందని వెల్లడించారు..
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో, ప్రభుత్వం 25 కోట్ల రూపాయాలను న్యాయశాఖ ద్వారా తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ కు మంజూరు చేయడం జరిగింది. గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి సలహా, సూచనల మేరకు ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ జనరల్ గారు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యాదర్శుల ఆద్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సహాకారంతో 14,886 మంది న్యాయవాదులకు ఒక్కొక్కరికి రూ. 16 వేల చొప్పున, 1054 న్యాయవాదుల గుమాస్తాలకు ఒక్కొక్కరికి రూ. 8 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు.
ఏప్రిల్ 2020 నుండి డిసెంబర్ 2020 వరకు 1733 మందికి ఉచిత న్యాయ సహాయం అందించినట్లు చెప్పారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆద్వర్యంలో నిర్వహించిన లోక్ ఆదాలత్ లలో 52,007 కేసులను పరిష్కరించి కక్షిదారులకు పరిహారంగా రూ. 159.84 కోట్లు అందించడం జరిగిందన్నారు. ప్రజా సేవలకు సంబంధించి 474 కేసులను పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు.