హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భమని.. జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నదన్నారు. దేశ విముక్తి కోసం తృణ ప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానీయులందరికీ నివాళులర్పించారు.
75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశ ప్రస్థానంలోని వెలుగు నీడల్ని మనందరం వివేచించుకోవాలని.. మనం సాధించింది ఏమిటి ? ఇంకా సాధించాల్సింది ఏమిటన్నది ఒక్కసారి మదింపు చేసుకోవాలన్నారు. ఒకవైపున దేశం అనేక రంగాల్లో.. కొంత మేరకు పురోగతిని సాధించింది. అదేసమయంలో నేటికీ చాలా రాష్ట్రాల్లో ప్రజలు కనీస అవసరాల కోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితి ఉందన్నారు. ‘స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి’ అని మహాకవి శ్రీశ్రీ రాసిన పాటనూ ఇప్పటికీ మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరింత నిబద్ధత, నిజాయితీ, సామరస్యం, సమభావం నిండిన దృక్పథంతో దేశ భవిష్యత్ నిర్మాణానికి భారతప్రజలు పునరంకితం కావాలని కోరుకుంటున్నానన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో, అహింసా మార్గంలో సాగిన జాతీయోద్యమమే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి మనం విజయం సాధించామన్నారు.
స్వరాష్ట్రం సాధించుకున్న నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్రంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రణాళికాబద్ధంగా తెలంగాణా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని.. అన్నిరంగాల అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే మార్గంలో ఎన్నో అవరోధాలు, సమస్యలు, సవాళ్లు.. మరెన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్ర ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నిటినీ అధిగమించి పురోగమించగలుగుతుందన్నారు. ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులకు, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యమన్నారు. అన్నిరంగాల్లో గుణాత్మకమైన, గణనీయమైన అభివృద్ధిని ఆవిష్కరించగలిగామని, వాస్తవం కళ్లముందే కనపడుతోందని, ప్రగతి ఫలాలు ప్రజల అనుభవంలో ఉన్నాయన్నారు. విద్యుత్ సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు, ఈ రంగాల్లో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
దీర్ఘ దృష్టితో రూపొందించిన ప్రనాళిక.. పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో పరిపాలనతో తెలంగాణ ఏడేళ్ల స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించిందన్నారు. 2013 -2014 తెలంగాణా ఏర్పడిన నాడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4,51,580 కోట్లు కాగా.. కొవిడ్తో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర అవరోధాలను సృష్టించినప్పటికీ 2020-2021 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,80,407 కోట్లుగా నమోదైందన్నారు. అదే విధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు 2013-2014 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,12,126 ఉండగా.. నేడు అది రూ.2,37,632 చేరుకుందన్నారు. నేడు మన దేశ తలసరి ఆదాయం రూ.1,28,829గా నమోదైందని, దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో పదికి మించి పార్లమెంట్ స్థానాలున్న పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. తలసరి ఆదాయంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పేందుకు గర్విస్తున్నానన్నారు.