శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. బుధవారం క్షేత్రంలోని పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సాక్షి గణపతి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, పుష్పార్చన నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం జ్వాలా వీరభద్రుడికి ప్రదోషకాలంలో షోడషోపచార పూజలు చేసినట్లు పేర్కొన్నారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని వెలిగించారు.
ఇదిలా ఉండగా.. దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ విరాళాల పథకానికి హైదరాబాద్కు చెందిన ఏవీఎస్ సురేశ్, డాక్టర్ అనురాధ దంపతులు రూ.10లక్షల విరాళం ఇవ్వగా.. చెక్కును సురేశ్ తల్లిదండ్రులు రమణమూర్తి, సుభద్ర ఈవో లవన్నకు అందజేశారు. రూ.3లక్షలు ఆగమ పాఠశాల నిర్వహణ, రూ.2లక్షలు గోశాల, రూ.2లక్షలు శాశ్వత అన్నదానం, రూ.50వేలు స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం కోసం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దంపతులకు స్వామిఅమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.