దేశవ్యాప్తంగా సేవలు.. వినియోగించుకుంటున్న గర్భిణులు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 ( నమస్తే తెలంగాణ ) : ఇది కొవిడ్ కాలం. ఈ పరిస్థితుల్లో బిడ్డకు జన్మనివ్వాలంటే చాలా మంది దంపతులు కలవరపడుతుంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం తినాలి..? ఏవైనా సమస్యలు వస్తే ఎలా..? అన్న సందేహాలతో గర్భిణులు అయోమయానికి గురవుతుంటారు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు రామకృష్ణమఠం ముందుకొచ్చింది. సునాయస ప్రసవం, బిడ్డ ఆరోగ్యంగా జన్మించడం కోసం జీవనశైలి ఎలా ఉండాలో దిశానిర్దేశం చేస్తుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎలాంటి అలవాట్లు పాటించాలో సూచిస్తారు. చిన్నపిల్లల వైద్యులు, గైనకాలజిస్టులు, వ్యాయామ టీచర్లు, క్లినికల్ సైకాలజిస్టులు, గాయకులు, పలువురు ప్రముఖులు ఈ సేవలను అందిస్తున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఆన్లైన్లో శిక్షణ, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. మార్చి నుంచి రామకృష్ణమఠంలో ఎప్పటిలాగానే తరగతులు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆర్యజనని సేవలను దేశ వ్యాప్తంగా గర్భవతులు ఉపయోగించుకోవడం విశేషం.
గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదల, ఆరోగ్యకరంగా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలపై నిపుణులు అవగాహన కల్పిస్తారు. గర్భిణుల మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని సరైన సలహాలు ఇస్తుంటారు. యోగా, ధ్యానం, ఆలాపన, ఒత్తిడిని తగ్గించుకోవడం, గాయత్రి మంత్రాన్ని ఉచ్ఛరించడం వంటి వాటిని ఆచరించాలని సూచిస్తారు. ఆధ్యాత్మికంగా కూడా అవగాహన కల్పిస్తూ.. స్వామీజీలతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఆరోగ్య విషయాలను ఆసక్తిగా వారికి చెబుతారు. ఇప్పటి వరకు 1200మంది గర్భిణులకు ఆర్యజనని అవగాహన కల్పించింది. ప్రతి శని, ఆదివారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు ఉంటాయి.
శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి మన చుట్టూ ఉన్న వాతావరణమే 80 శాతం సహకరిస్తుంది. గర్భిణుల్లో పాజిటివిటీని పెంపొందించడానికి సరైన ప్రణాళికలతో అవగాహన కల్పిస్తాం. గర్భిణి సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు శారీరకంగా, మానసికంగా అనారోగ్యంగా ఉంటారు. రామకృష్ణమఠం ఆర్యజనని వెబ్సైట్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్లో వివరాలు ఉన్నాయి. 9603906906 నంబర్కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలి. గ్రామీణులకు ఉచితంగా సేవలు ఉంటాయి. తెలుగు, కన్నడ, ఇంగ్లిష్, హిందీ భాషల్లో అవగాహన తరగతులు అందుబాటులో ఉంటాయి. – డాక్టర్ అనుపమ, చిన్నపిల్లల వైద్యురాలు, రామకృష్ణమఠం