ఢిల్లీ ,జూలై :ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిల వసూళ్ల కు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. 2021-22 బడ్జెట్ కు సంబంధించి ఆమె పలు అంశాలను గురించి వెల్లడించారు. ” ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిల (నిరర్ధక ఆస్తులు) వసూళ్ల కోసం చర్యలు చేపట్టమన్నారు. ప్రస్తుతం ఉన్న నిరర్ధక ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి “అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ”ని ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత, నిరర్ధక ఆస్తులను నిర్వహించి, వాటి విలువ నిర్ధరణ కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు, ఇతర పెట్టుబడిదారులకు బదిలీ చేస్తాం.”అని నిర్మలాసీతారామన్ తెలిపారు.
‘నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్’ (ఎన్ఐఆర్సీఎల్)ను 2021 జులై 7న ‘రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్’ వద్ద నమోదు చేసినట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) వివరించిందని ఆమె పేర్కొన్నారు. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ (ఏఆర్సీ) నియంత్రణ సంస్థగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏఆర్సీల కోసం ఇప్పటికే విధివిధానాలను నిర్దేశించింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ నిరర్ధక ఆస్తులను ఏఆర్సీలకు బదిలీ చేయడానికి చక్కటి నిబంధనలు ఉన్నాయి. ఏఆర్సీల ద్వారా నిరర్ధక ఆస్తుల గుర్తింపు అనేది కొనసాగుతున్న ప్రక్రియగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.