నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 28 : ఆసరా పింఛన్ల పంపిణీలో దేశంలో తెలంగాణే అగ్రగామిగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంత ఎక్కువ మందికి, ఇంత పెద్ద మొత్తం ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదని తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్దారులకు కార్డులను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్, నస్రుల్లాబాద్ మం డల కేంద్రాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, సిద్దిపేటలో మంత్రి తన్నీరు హరీశ్రావు, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, వనపర్తిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్రెడ్డి కొత్త పింఛన్దారులకు కార్డులు అందజేశారు.
కాగా కామారెడ్డి జిల్లా బీర్కూర్, నస్రుల్లాబాద్లో జరిగిన కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో వెయ్యి చొప్పు న, కేరళ, గుజరాత్లాంటి రాష్ర్టాల్లో రూ.750, బీహార్ తదితర రాష్ట్రాల్లో కేవలం రూ.400 చొప్పున అక్కడి ప్రభుత్వాలు పింఛన్ ఇస్తున్నాయని తెలిపారు. అదీ 75 నుంచి 85 ఏండ్ల వయసు మీద పడిన వారికే అందిస్తున్నారని వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ 57 ఏండ్లు వయసు నిండిన వారికి ఆసరా పింఛన్ అందిస్తున్నట్టు చరిత్రలో లేదన్నారు.
ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఎంత పింఛన్ ఇస్తున్నరు? తెలంగాణలో అమలవుతున్న పథకాలు అక్కడ ఉన్నాయా? ఆ రాష్ట్ర రైతుకు 24 గంటల కరెంట్ ఇస్తున్నరా? తెలంగాణ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్లో కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు పింఛన్ల కార్డుల పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల మేలు కోసం పరితపిస్తుంటే ఓర్వలేని బీజేపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అర్హులందరికీ పింఛన్లు మంజూరవుతాయని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్లతో ప్రభుత్వం వృద్ధులకు అండ గా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తిలో పింఛన్దారులకు కార్డులు పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం రూ.75 పింఛన్ మాత్రమే ఇచ్చే వారని గుర్తుచేశారు. ఇందుకోసం నిరుపేదలు పైరవీలు చేయాల్సి వచ్చేదన్నారు. కానీ నేడు ఒక్కొక్కరికీ రూ.2,016 చొప్పున అందిస్తుండటంతో వారి మోములో ఆనందం వెల్లివిరుస్తున్నదని చెప్పారు. పింఛన్ జాబితాలో అనర్హులు ఉంటే వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు.
రాష్ట్ర జనాభాలో 60 శాతం కుటుంబాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛ న్లు పొందుతున్నట్టు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్. ఎస్ మండల కేంద్రంలో పింఛన్ల కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆసరా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు కేవలం 20 శాతం కుటుంబాలేనని తెలిపారు.