బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 2: దేశంలోనే ఒక ఉన్నతమైన మంత్రి స్థానంలో ఉన్న నిర్మలా సీతారామన్ అవగాహనా రాహిత్యంతో మాట్లాడటం సరికాదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హితవు చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పర్యటన సందర్భంగా నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్గా కాదు.. నియోజకవర్గ ఎమ్మెల్యేగా కేంద్రమంత్రి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత తనకు ఉన్నదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి కేంద్రమంత్రి వస్తే సంతోషించానని, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారని ఆశించానని చెప్పారు. కానీ, ఆమె తన స్థాయిని దిగజార్చుకొనేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో బాన్సువాడలో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు కోసం ఢిల్లీకి వెళ్లి ఆమెకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటికీ స్పందించలేదని చెప్పారు.
తాను పశుసంవర్ధకశాఖ మంత్రిగా ఉన్నప్పుడే గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టామని, దీనికి ఎన్సీడీసీ రుణం తీసుకొన్నామని గుర్తుచేశారు. ఈ పథకంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చేపపిల్ల పంపిణికీ కేంద్రమే నిధులు ఇస్తున్నట్టు చెప్పుకోవడం అబద్ధమని తేల్చిపారేశారు. ఈ పథకానికి కూడా ఎన్సీడీసీ ద్వారా రుణం తెచ్చామని వివరించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టాదారులకే సహాయం చేస్తున్నదని, కౌలు రైతులకు చేయడం లేదని గుర్తుచేశారు. డబుల్ బెడ్రూం పథకం కేంద్రానిదే అయితే మిగతా రాష్ర్టాల్లో ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని హితవు చెప్పారు.