లక్నో: యూపీలో జరిగిన పార్టీరహిత పంచాయితీ ఎన్నికల్లో బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఆధిక్యత సాధించింది. నేరుగా పార్టీలు రంగంలోకి దిగకుండా తాము బలపరిచే అభ్యర్థులను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపాయి. జిల్లా పంచాయితీల్లోని సగంపైగా స్థానాలు తమకు దక్కాయని, ప్రభుత్వ యంత్రాంగం సర్టిఫికెట్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నదని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. నాలుగు దశల్లో నిర్వహించిన పంచాయితీ ఎన్నికలు ఏప్రిల్ 29న ముగిసాయి. గ్రామపంచాయితి, గ్రామ ప్రధాన్, బ్లాక్ పంచాయతి, జిల్లా పంచాయితి ఇలా నాలుగు అంచెల వ్యవస్థకు ఈ ఎ్నికలు నిర్వహించారు. యూపీలో పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తుల ఆధారంగా జరగవు. కానీ ఈసారి అన్ని పార్టీలు కేంద్రీకృతమైన పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం నిర్వహించాయి. మొత్తం మీద అధిక స్థానాలు సంపాదించిన పాలక బీజేపీ కీలకమైన అయోధ్య, వారణాసి జిల్లాల్లో వెనుకబడినట్టు తెలుస్తున్నది. రామాలయం నిర్మించే అయోధ్యలో 40 జిల్లా పంచాయితీ స్థానాలుండగా బీజేపీ కేవలం ఆరింటికే పరిమితమైంది. సమాజ్వాదీ పార్టీ 24 స్థానాలు, బీఎస్పీ 5 స్థానాలు గెలిచాయి. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలో పాలక బీజేపీ 7 స్థానాలు మాత్రమే గెల్చుకుంది. సమాజ్వాదీ పార్టీ 15 స్థానాలు గెల్చుకుంది. రాష్ట్రమంతటా కలిపి 3,050 జిల్లాస్థాయి పంచాయితీ స్థానాలుండగా బీజేపీ 918 స్థానాలు గెల్చుకుంది. మరో 500 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఆప్ కూడా 70 దాకా స్థానాలు గెల్చుకున్నట్టు ప్రకటించింది.