న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగిస్తూ.. ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం సరైందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో మిస్త్రీ సారథ్యంలోని షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ పరిశ్రమల భవితవ్యంపై ప్రభావం పడనున్నది. అయితే, టాటా సన్స్లో మైనారిటీ వాటాదారుగా ఎస్పీ గ్రూప్ చేస్తున్న వాదన.. రెండు సంస్థల మధ్య మరో న్యాయ పోరాటానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏడు దశాబ్దాలుగా టాటా సన్స్లో మైనారిటీ వాటా దారు (18.4 శాతం)గా ఎస్పీ గ్రూప్.. తన వాటా విలువ రూ.1.78 లక్షల కోట్ల పై చిలుకు ఉంటుందని వాదిస్తున్నది. కానీ టాటా సన్స్ మాత్రం రూ.60 వేల కోట్లు మాత్రమేనని పేర్కొంటున్నది. ఈ నేపథ్యంలో తమ సంస్థలో ఎస్పీ గ్రూప్ వాటాలు, వాటి విలువపై ముందడుగు వేయకుండా గతేడాదే టాటా సన్స్ను సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
టాటా సన్స్కు అనుకూలంగా శుక్రవారం తీర్పు చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ సంస్థలో ఎస్పీ గ్రూప్ వాటాలు, దాని విలువ చెల్లింపు అంశంపై మరో న్యాయ ప్రక్రియ ద్వారా తేల్చుకోవాలని పేర్కొనడం గమనార్హం. టాటా సన్స్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరిన సైరస్ మిస్త్రీ ఆశలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నీళ్లు చల్లింది.
ఇప్పటికే రుణాల ఊబిలో చిక్కుకున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్.. రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రణాళికతో బ్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్తుల విక్రయం ద్వారా సుమారు 10 వేల కోట్ల నిధులు సమకూర్చుకుంటామని, వాటిని రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని బ్యాంకర్లకు ఎస్పీ గ్రూప్ తెలిపినట్లు సమాచారం.
యురేకా ఫోర్బెస్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ సొలార్, అఫ్కాన్స్ ఇన్ప్రాస్ట్రక్చర్ సంస్థల్లో వాటాలను ఎస్పీ గ్రూప్ విక్రయించనున్నది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్.. బ్యాంకర్లకు సుమారు రూ.23,500 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉన్నదని సమాచారం.
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!