లక్నో : యూపీలో వరుసగా రెండోసారి యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో కాషాయ సర్కార్ కొలువుతీరనుండగా యోగి హయాంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. నీతిఆయోగ్ ప్రకటించిన మల్టీడైమెన్షల్ పేదరిక సూచీ (ఎంపీఐ)లో యూపీ ముందువరసలో ఉందని దుయ్యబట్టారు. దేశంలో అత్యంత పేదరికంతో తల్లడిల్లుతున్న మూడు రాష్ట్రాల్లో యూపీ ఒకటని వెల్లడించిన వార్తాపత్రిక క్లిప్లింగ్ను అఖిలేష్ ట్విటర్లో పోస్ట్ చేశారు.
నీతిఆయోగ్ వెల్లడించిన తొలి ఎంపీఐలో దేశంలోని అత్యంత పేద రాష్ట్రాల్లో బీజేపీ పాలిత యూపీ ఒకటని ఎస్పీ చీఫ్ స్పష్టం చేశారు. పోషకాహార లేమి, శిశుమరణాల రేటు క్యాటగిరీలో యూపీ మూడో ర్యాంక్ సాధించిందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలకు ఈ గణాంకాలు సంకేతాలని అఖిలేష్ పేర్కొన్నారు. నీతిఆయోగ్ ఎంపీఐ నివేదిక ప్రకారం భారత్లో అత్యంత పేద రాష్ట్రాలుగా వరుసగా బిహార్, జార్ఖండ్, యూపీలు నిలిచాయని చెప్పారు.
ఇక యూపీ ముఖ్యమంత్రిగా ఈనెల 25న యోగి ఆదిత్యానాధ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి 60,000 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివస్తారని కాషాయ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాధ్ సింగ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ పార్టీ దిగ్గజ నేతలు తరలిరానున్నారు.