లక్నో : ధరల పెరుగుదలపై యోగి ఆదిత్యానాధ్ నేతృత్వంలోని యూపీ బీజేపీ సర్కార్ లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం చుక్కలు చూస్తుండటంతో నిత్యావసరాలు భారమై గ్రామాల్లో నిరాశ అలుముకుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగం, ధరల మోతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను యోగి ప్రభుత్వం విస్మరిస్తోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్పిందని ఈ దిశగా ఏం సాధించారో వారు ప్రజలకు చెప్పాలని నిలదీశారు.
పప్పు ధాన్యాలు, వంట నూనెలు, ఇంధనం, సిమెంట్, స్టీల్ సహా నిత్యావసర వస్తువుల ధరలు పట్టపగ్గాల్లేకుండా పెరిగాయని, ధరల మంటతో గ్రామాల్లో నిరాశాపూరిత వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడం లేదని అన్నారు.