గత ఏడాది కంటే పెరిగిన ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే జోన్ వెల్లడి
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 103 రోజుల్లోనే తుక్కు ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు. తుక్కు అమ్మకంతో గత ఏడాది కంటే ఈసారి రెట్టింపు ఆదాయం వచ్చిందని తెలిపారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో తుక్కు అమ్మడం ద్వారా రూ.52.12 కోట్ల ఆదాయం వస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. నిరుపయోగంగా ఉన్న తుక్కును గుర్తించి, వెంటనే ఆన్లైన్ వేలం ద్వారా క్లియర్ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీఆర్ ఉద్యోగులను జోనల్ రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ అభినందించారు.